
ఇన్వెస్టర్స్ ఎదురుచూస్తున్న లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ (LIC ) పబ్లిక్ ఇష్యూ మొదలైంది. మే 4న ప్రారంభమై మే 9 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. మే 17న ఎల్ఐసీ షేర్లు స్టాక్ మార్కెట్లలో నమోదు కానున్నాయి. ఈ సంస్థలో 3.5 శాతం వాటాకు సమానమైన 22.15 కోట్ల షేర్లను అమ్మడం ద్వారా ప్రభుత్వం రూ.21,000 కోట్లు ఆర్జించనుంది. భారత ఈక్విటీ మార్కెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఐపీవో. ఒక్కొక్క షేర్ ధర రూ.902-949 నిర్ణయించారు. కనీసం 15 షేర్లకు బిడ్ వేయాల్సి ఉంటుంది. గరిష్ఠ ధర అంటే 949 రూపాయల వద్దే మనం బిడ్ వేయాల్సి ఉంటుంది. ఆ ధరనే మనం ఎంచుకోవాలి. అంటే ఇన్వెస్టర్స్ కనీసం రూ.14,235 పెట్టుబడిగా పెట్టాలి. విజయవంతమైన బిడ్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి షేర్లు మే 16న వస్తాయి. మే 17న స్టాక్ ఎక్స్ఛేంజీలో షేర్లు నమోదు అవుతాయి.
special issue of LIC shares
కేటగిరీల వారీగా ప్రత్యేక షేర్లు..
రిటైల్ విభాగంలో ఎల్ఐసీ తన పాలసీదారులకు ప్రత్యేకంగా షేర్లను జారీ చేసింది. ఇష్యూ పరిమాణంలో 2.21 కోట్ల షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కొక్క షేరుపై రూ.60 రాయితీ ఇచ్చింది. ఈ సమయంలో ఇన్నాళ్ళు పాలసీలకు ప్రీమియం చెల్లిస్తున్న పాలసీదారులు ఎల్ఐసీలో వాటాదారులుగా మారేందుకు అవకాశం లభించింది. ఎల్ఐసీ తమ ఉద్యోగుల కోసం కూడా 15.81 లక్షల షేర్లను కేటాయించింది. వీరికి ఒక్కొక్క షేరుపై రూ.45 రాయితీ కల్పించింది. ఇందులో 50 శాతం షేర్లు క్వాలిఫైడ్ ఇన్ స్టిట్యూషనల్ బయ్యర్లకు కేటాయించారు. దీంట్లో 60 శాతం వాటాను యాంకర్ ఇన్వెస్టర్లకు రిజర్వ్ చేశారు. నాన్- ఇన్ స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 15 శాతం వాటాలను కేటాయించారు.
పాలసీ దారులు ఇలా..
పాలసీ దారులు ఐపీవో ఆప్షన్లోకి వెళ్లగానే కనిపించే బిడ్ మీద సెలక్ట్ చేసి అక్కడినుంచి ఇన్వెస్టర్ టైప్ లో ఉండే పాలసీ హోల్డర్ కేటగిరిలో అప్లై చేసుకోవాలి. ఇక్కడ వివరాలు నమోదు చేయగానే రాయితీ వస్తుంది. అంటే సుమారు 900 రూపాయలు డిస్కౌంట్తో ఒక లాట్ ను పొందవచ్చు.
నిధులన్నీ ప్రభుత్వానికే..
సంస్థ ఎంబెడెడ్ విలువను సెప్టెంబర్ 30, 2021 నాటికి రూ.5.4 లక్షల కోట్లుగా అంచనా వేశారు.
మొదటి ఫిబ్రవరిలో వేసిన ప్రణాళిక ప్రకారం ఎల్ఐసీ లో 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను ఐపీఓ విక్రయించి రూ.63,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో పరిమాణాన్ని రూ.21,000 కోట్లకు తగ్గించారు. సెబీ నిబంధనల ప్రకారం రూ.లక్ష కోట్లకు పైగా విలువ చేసే కంపెనీలు ఐపీఓకి వస్తే కనీసం 5 శతం వాటాలను విక్రయించాలని సెబీ తెలిపింది. దీని నుంచి మినహాయింపు కోరుతూ సెబీకి గతవరం దరఖాస్తు చేసుకుంది. ఈ ఐపీఓ ద్వారా సమకూరే నిధులన్నీ పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ప్రభుత్వ ఖజానాకు చేరనున్నాయి.