
ఇండియా వ్యాపార రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగిన సామ్రాజ్యం రిలయన్స్.. జియో నెట్వర్క్తో అందరికీ ముఖ్యంగా యువతకూ చేరువై టెలికాం ట్రెండ్నే మార్చేసింది. అక్కడతో ఆగక ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ మరిన్ని వ్యాపారాలకు విస్తరిస్తూ కొత్త ప్రణాళికలతో దూసుకు పోతుందీ సంస్థ.. ఒకప్పుడు అన్నీ తానే ప్రారంభించి అభివృద్ధి చేయాలని తహతహలాడిన కంపెనీ ఇప్పుడు కాస్త వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది! టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పుల దృష్ట్యా ఆయా రంగాల్లోని ఇతర కంపెనీలతో కలిసి నడవాల్సిన అవసరమూ ఉందని గుర్తించింది. అందుకే గత నాలుగే ళ్లుగా వివిధ రంగాల్లో పెట్టుబడులను ముమ్మరం చేసింది.
new investments of reliance
దాటిగా పెట్టుబడులు..
వివిధ రంగాల్లో కొనుగోళ్ళు, పెట్టుబడుల కోసం రిలయన్స్ గత నాలుగేళ్ళలో 5.7 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.42.2 వేల కోట్లు) వెచ్చించింది. ఇటీవలే ‘ మాండరిన్ ఓరియంటల్ న్యూయార్క్’ హోటల్ లో 73.27 శాతం వాటా కొనుగోలు చేయడంతో ఆతిథ్య రంగంలో తన ఉనికిని విస్తరించింది. అలాగే క్షేత్రస్థాయి డెలివరీ ప్లాట్ ఫాం డుంజోలో 200 మిలియన్ డాలర్ల తో 25.8శాతం వాటాలు సొంతం చేసుకుంది.
విదేశీ పెట్టుబడులకు మించి..
మరోవైపు భారత కంపెనీల్లో గత కొన్నేళ్లుగా విరివిగా నిధులు కుమ్మరిస్తోన్న విదేశీ పెట్టుబడి సంస్థలకు రిలయన్స్ పోటీగా నిలుస్తోంది. గత దశాబ్ద కాలంగా భారత్ లో సాఫ్ట్ బ్యాంక్ 14 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టింది. 2005 నుంచి నాస్పర్స్ డిజిటల్ విభాగమైన ప్రోసస్ 6 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. బిల్ పే కొనుగోలుకు క్లియరెన్స్ లభిస్తే.. ప్రోసస్ పెట్టుబడుల విలువ 10 బిలియన్ డాలర్లకు చేరుతుంది. రిలయన్స్ మాత్రం నాలుగేళ్ల క్రితమే తన కొనుగోళ్ళు, పెట్టుబడుల ప్రస్థానాన్ని ప్రారంభించింది… పైగా విదేశీ సంస్థల వలే మంచి రేటు వచ్చినప్పుడు వాటాలు అమ్ముకొని నిష్క్రమించే ఉద్దేశంతో మాత్రం ముందుకు వెళ్ళడం లేదు.
* కేవలం గత సంవత్సరంలోనే రిలయన్స్ వివిధ కంపెనీల్లో 1.8 బిలియన్ డాలర్ల పెట్టుబడిగా పెట్టింది. వీటిలో కొన్నింటిని పూర్తిగా కొనేస్తే.. మరికొన్నింటిలో గణనీయ వాటాలు సొంతం చేసుకుంది. వీటిలో ఆరు పునరుత్పాదక ఇంధన కంపెనీలతో పాటు జస్ట్ డయల్(767 మిలియన్ డాలర్లు) కూడా ఉంది.
* ఫ్యూచర్ గ్రూప్ రిటైల్ బిజినెస్ ను సొంతం చేసుకునేందుకు కుదిరిన ఒప్పందం కూడా క్లియర్ అయ్యి ఉంటే రిలయన్స్ పెట్టుబడులు 9 బిలియన్ డాలర్ల (దాదాపు రూ 66.60 వేల కోట్లు)కు చేరేవి. అయితే, అమెజాన్, ప్యూచర్ గ్రూప్ మధ్య నెలకొన్న న్యాయపరమైన చిక్కులు దీనికి బ్రేకులు వేశాయి.
what are the reliance future plans
దీర్ఘకాల వ్యూహంతో..
టెక్నాలజీలో వేగంగా వస్తున్న మార్పులను అందిపుచ్చుకునే క్రమంలోనే రిలయన్స్ దీర్ఘకాల లక్ష్యంతో తన వ్యూహాన్ని మార్చిందని వాణిజ్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే కొత్త రంగాల్లోకి ప్రవేశించి, విస్తరించేందుకు కావాల్సిన సమయమూ ఆదా అవుతుందని కంపెనీ భావిస్తున్నట్లుందని విశ్లేషించారు. అందుకే టెలికాం, రిటైల్, పునరుత్పాదక ఇంధనం,మీడియా, ఎంటర్ టైన్ మెంట్ రంగాల్లో బలంగా ఉన్న భాగస్వాములతో చేతులు కలుపుతోందని పేర్కొన్నారు.
భవిష్యత్పై దృష్టి..
పునరుత్పాదక ఇంధనంతో పాటు 2021లో రిలయన్స్ ఫ్యాషన్ అండ్ డిజైన్ రంగంలోకీ ప్రవేశించింది. రితుకుమార్, మనీశ్ మల్హోత్రా, అనామికా ఖన్నా వంటి ప్రముఖులు నిర్వహిస్తున్న కంపెనీల్లో వాటాలు సొంతం చేసుకుంది. అలాగే వస్త్ర రంగంలోకీ కొన్ని నిధులను మళ్లించింది. అయితే, ఈ ఒప్పందాల విలువను మాత్రం బయటకు వెల్లడించలేదు. మిల్క్ బాస్కెట్ ను కొనుగోలు చేసిన విలువను సైతం బహిర్గతం చేయలేదు. ఇప్పటికీ ఇంటర్నెట్, టెలికాం రంగంలోనే రిలయన్స్ పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. కంపెనీ వివరాలు, మోర్గాన్ స్టాన్లీ గణాంకాల ప్రకారం.. ఈ రెండు రంగాల్లో కంపెనీ దాదాపు 2.5 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టిందని అంచనా. తర్వాత ఇంధన రంగంపై దృష్టి సారించింది. క్రమంగా చమురు శుద్ధి నుంచి గ్రీన్ ఎనర్జీ వైపు అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పునరుత్పాదక ఇంధన రంగంలోని అనేక కంపెనీల్లో భారీగా పెట్టుబడులు పెట్టింది. దాదాపు 1.5 బిలియన్ డాలర్ల ను ఈ రంగానికి వెచ్చించింది. సోలార్ సెల్స్, ప్యానెల్స్ తయారు చేసే ఆర్ఈసీ సోలార్ హోల్డింగ్స్ ను 771 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. * ఇక రిటైల్ రంగంలో పెట్టుబడులు డుంజోలో పెట్టిన నిధులతో కలిపినా ఇంకా 1బిలియన్ డాలర్లకు చేరలేదు. అయితే, ప్యూచర్ రిటైల్ కొనుగోలుకు కుదిరిన ఒప్పందం ఓకే అయితే.. ఈ రంగంలో 3.3 బిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టినట్లవుతుంది.