రూపాయి విలువ అంతర్జాతీయ మార్కెట్లో వరుసగా బలహీనపడుతుండగా, విదేశాల్లో పనిచేస్తున్న భారతీయుల పంపకాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా యూఏఈ, సౌదీ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న కార్మికులు పంపే రిమిటెన్సులు ఇటీవల గణనీయంగా పెరిగాయి. రూపాయి పతనం కారణంగా అక్కడి దిర్హమ్తో పోలిస్తే భారత్ ఖాతాలకు వస్తున్న నగదు మూడింతలు పెరిగినట్లే అనుభవం కలుగుతోందని బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి.
దిర్హమ్ బలంగా – రూపాయి బలహీనంగా..Dirham Strengthens, Rupee Weakens
గత కొద్ది నెలలుగా గ్లోబల్ మార్కెట్లలో డాలర్ దూకుడుగా పయనిస్తుండటంతో రూపాయి వరుసగా పతనమవుతోంది. దిర్హమ్–రూపాయి మారకపు విలువ పెరగడంతో గల్ఫ్లో ఉన్న కార్మికులు పంపే ప్రతి దిర్హమ్కు భారతీయ కుటుంబాలకు మరింత ఎక్కువ మొత్తంలో నగదు అందుతోంది. దీంతో రిమిటెన్స్ సెంటర్ల వద్ద క్యూలు పెరిగి, ట్రాన్సాక్షన్ వాల్యూమ్ రికార్డు స్థాయికి చేరింది.
మూడింతలు సంతృప్తి..Triple the Satisfaction
యూఏఈలో ఉన్న ఉద్యోగులకు జీతాల్లో పెరుగుదల లేకపోయినా, రేటు మార్పులు మాత్రమే భారీ లాభం తీసుకొస్తున్నాయి. 1 దిర్హమ్ = గతంలో 18–19 రూపాయలు… ఇప్పుడు 22–23 రూపాయలకు చేరుకోవడంతో
అదే జీతం పంపినా.. భారత కుటుంబాలకు చేరే మొత్తంలో మూడింతల లాభం పొందుతున్నామనే భావన ఏర్పడింది. బ్యాంకులు, మనీ ఎక్స్చేంజ్ కంపెనీలు ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నాయి.
“గత నెలతో పోలిస్తే యూఏఈ నుంచి పంపిన రిమిటెన్సులు 25–35% పెరిగాయి. రూపాయి బలహీనపడిన ప్రతిసారి ఇలాంటి ట్రెండ్ చూస్తాం. ఈసారి పెరుగుదల మరింత ఎక్కువగా ఉంది” అని బ్యాంక్ అధికారులు వెల్లడించారు. ఏదేమైనా భారత్లో కుటుంబాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. విదేశాల్లో కష్టపడి పనిచేసే కుటుంబ సభ్యుల నుండి పంపే నగదు ఇప్పుడు ఎక్కువ మొత్తంలో అందుతుండటంతో గ్రామాల్లో, పట్టణాల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. అప్పుల తీర్చడం, ఇళ్ళ నిర్మాణ,
పిల్లల చదువు ఖర్చులు వంటి పనులు వేగంగా పూర్తి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.
రూపాయి పతనంతో ఆందోళన ..Worry Over Rupee’s Decline
ఒక్కవైపు గల్ఫ్ రిమిటెన్సులు పెరుగుతున్నా .. మరోవైపు దిగుమతులపై భారత్కు భారం పెరుగుతుంది.
క్రూడ్ ఆయిల్, ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారం దిగుమతులకు భారీగా అదనపు ఖర్చు అవుతుండటంతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తప్పదని నిపుణులు చెబుతున్నారు. రూపాయి పతనం తాత్కాలికంగా రిమిటెన్స్ గ్రహీతలకు లాభం తెచ్చినా… దీర్ఘకాలంలో దిగుమతులు ఖరీదు కావడం, ద్రవ్యోల్బణం పెరగడం వంటి సమస్యలు రావచ్చు. ప్రభుత్వ, ఆర్బీఐ చర్యలతో మారకపు విలువను నిలకడైన స్థాయికి తీసుకురావాలని ఆర్థిక విశ్లేషకులు సూచిస్తున్నారు. రూపాయి బలహీనపడిన ప్రతిసారి… విదేశాల్లో పనిచేసే భారతీయుల రిమిటెన్సులు కుటుంబాలకు ఓ మానసిక బలం ఇస్తాయి. అయితే దీని వెనుక దాగి ఉన్న ఆర్థిక ప్రమాదాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
రూపాయి పతనం… సామాన్యుడిపై భారం ఎంత? Rupee Slide: How Much Burden on the Common Man?
అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి వరుసగా బలహీనపడుతూ చరిత్రాత్మక కనిష్ఠ స్థాయిలకు చేరింది. డాలర్ దూకుడు ఆగకపోవడంతో భారతీయ కరెన్సీపై ఒత్తిడి పెరిగిపోతోంది. ఈ మారకపు విలువ పతనం ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై మాత్రమే కాక, సామాన్యుడి జేబుపైనా నేరుగా పడుతోంది. రోజువారీ అవసరాలు, ప్రయాణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులన్నింటిపై భారం పెరుగుతోంది.
దిగుమతులు పెరిగే కొద్దీ… ధరల దెబ్బ.. As Imports Rise… Prices Hit Hard
భారత్ పెద్ద ఎత్తున దిగుమతులు చేసుకునే వస్తువులపై తొలి ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్. రూపాయి బలహీనపడితే డాలర్లలో దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ మరింత ఖరీదవుతుంది.దీని ప్రభావంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి. రవాణా ఛార్జీలు పెరుగుతాయి. తద్వారా కూరగాయలు, ధాన్యాలు, రోజువారీ సరుకుల ధరలు కూడా నింగినంటుతాయి. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీలలో కీలక భాగాలు దిగుమతి చేయాల్సి వస్తుంది. రూపాయి పడిపోతే ఎలక్ట్రానిక్ వస్తువులపై 2%–10% వరకు అదనపు భారం పడుతుంది. గాడ్జెట్ ధరలు మరింత పెరగే అవకాశం ఉంది. మెడికల్ పరికరాలు, మందులు, ఆప్టికల్ పరికరాలు, డయాగ్నస్టిక్ మిషన్లు, ముడి మందులు విదేశాల నుంచే వస్తాయి. డాలర్ బలపడితే ఆసుపత్రి చికిత్స ఖర్చులు కూడా పెరుగుతాయి. రవాణా–దిగుమతి ఖర్చులు పెరగడంతో పాలు , నూనెలు, FMCG ఉత్పత్తులు, కూరగాయలు ధరలు పెరుగుతాయి.
విదేశీ ప్రయాణం – రెట్టించిన ఖర్చు… Foreign Travel — Double the Cost
డాలర్ విలువ పెరిగినందున విదేశీ ట్రిప్స్, విద్య, మెడికల్ టూరిజం ఖర్చు కూడా పెరుగుతుంది. విమాన టికెట్లు, హోటల్స్, స్థానిక రవాణా కు బడ్జెట్ మించి వెచ్చించాల్సి వస్తుంది.
విదేశీ చదువు – తల్లిదండ్రులకు టెన్షన్.. Overseas Education — A Growing Worry for Parents
ట్యూషన్ ఫీజులు డాలర్లలో ఉండడం వల్ల విదేశీ కోర్సు ఖర్చు మరింత పెరుగుతుంది. విద్యార్థుల జీవన ఖర్చు కూడా 15% వరకు పెరిగే అవకాశం ఉంది. దీంతో తల్లిదండ్రులపై భారం పడుతుంది.
రుణాల EMIపై పరోక్ష ప్రభావం… Indirect Impact on Loan EMIs
ఇంధన , దిగుమతి ధరలు పెరగడంతో ద్రవ్యోల్బణం అధికమవుతుంది. దీని కారణంగా ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంపు చేసే అవకాశం ఉంటుంది . హోం లోన్, కార్ లోన్ EMIలు పెరిగే అవకాశం ఉంది. అయితే… ప్రయోజనం పొందేవారు కూడా ఉన్నారు. రూపాయి పతనం వల్ల ఎగుమతిదారులు, విదేశాల్లో పనిచేసే భారతీయుల కుటుంబాలు కొంత లాభం పొందుతారు. రిమిటెన్స్ ఎక్కువగా అందుతుండడం వల్ల ఎగుమతులకు డిమాండ్ పెరుగుతుంది. కానీ దేశీయ వినియోగదారుడి కోణంలో చూసుకుంటే… భారం మాత్రం తప్పదు. “రూపాయి మరింత బలహీనమైతే రాబోయే రెండు నెలల్లో ద్రవ్యోల్బణం 0.5%–1% వరకు పెరిగే అవకాశం ఉంది. దిగుమతులను తగ్గించే విధానాలు, స్థిర కరెన్సీ చర్యలు అవసరం” అని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
డాలర్ దూకుడు ..Dollar Surge
భారత్–అమెరికా డీల్పై నెలకొన్న అనిశ్చితులు, విదేశీ పెట్టుబడుల పెద్ద ఎత్తున వెనుకంజ… ఈ రెండు అంశాలు కలిసి రూపాయి విలువను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. గత కొన్ని వారాలుగా సాగుతున్న బలహీనత నేటి ట్రేడింగ్లో మరింత పెరిగింది. ఒక దశలో రూపాయి ఏకంగా 28 పైసలు క్షీణించి 90.43 వద్దకు చేరి సరికొత్త జీవనకాల కనిష్ఠాన్ని తాకింది.
వెనక్కి పోతున్న విదేశీ పెట్టుబడులు… Foreign Investments Pulling Back…
భారత ఈక్విటీ, డెట్ మార్కెట్ల నుంచి విదేశీ మదుపర్లు కోట్ల రూపాయల పెట్టుబడులను వరుసగా వెనక్కి తీసేస్తున్నారు. గ్లోబల్ ఆర్థిక అనిశ్చితి. భారత్–అమెరికా వాణిజ్య చర్చల్లో స్పష్టత లేకపోవడం. US యీల్డ్స్ పెరుగుదల వంటి అంశాలు విదేశీ ప్రవాహాలను తగ్గించాయి. FPI ఔట్ఫ్లోలు పెరిగినప్పుడల్లా డాలర్కు డిమాండ్ పెరుగుతుంది. అదే ఇప్పుడు రూపాయి విలువను మరింత బలహీనపరుస్తోంది. దిగుమతిదారుల డాలర్ కొనుగోళ్లు కూడా ఒత్తిడి పెంచుతున్నాయి. రూపాయి విలువపై ఒత్తిడి ఇంకా కొన్నిరోజులు కొనసాగవచ్చు. కరెన్సీ 90.70–91 స్థాయిలను తాకే అవకాశం ఉంది. గ్లోబల్ మార్కెట్ స్థిరపడే వరకు రూపాయి పునరుద్ధరణ కష్టమే. “భారత్–అమెరికా డీల్లో స్పష్టత వచ్చినా, FPI ప్రవాహాలు తిరిగి పుంజుకున్నా అప్పుడే కొంత ఉపశమనం లభిస్తుంది” అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

