రూపాయి క్షీణత .. ‘టీవీ – మొబైల్‌’ భారం.. ! Rupee Depreciation: ‘TV–Mobile’ Burden Mounts!

రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న వేళ (Rupee Depreciation)… దాని ప్రభావం సామాన్యుడి జేబుపై ప‌డుతోంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ధరలు పెరగడానికి ఇదే ప్రధాన కారణంగా మారింది. దిగుమతులపై ఆధారపడే ఈ రంగంలో డాలర్‌ ధర పెరగడం వల్ల తయారీ ఖర్చులు అధికమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో తమ ఆదాయాన్ని పెంచుకునే దిశగా ఆయా సంస్థ‌లు అడుగులు వేస్తున్నాయి. టీవీ, మొబైల్‌ ధరలు పెరగడం, రీచార్జ్‌ ఖర్చులు అధికం కావడం వల్ల సామాన్య కుటుంబ బడ్జెట్‌పై ఒత్తిడి పెరగ‌నుంది. అయితే నాణ్యమైన సేవలు, వేగవంతమైన నెట్‌వర్క్‌ కోసం కొంత భారం తప్పదని నిపుణులు చెబుతున్నారు.
మొత్తానికి రూపాయి క్షీణత ప్రభావం ఎలక్ట్రానిక్స్‌ నుంచి టెలికాం వరకు విస్తరించింది. ఈ భారాన్ని ఎలా సమతుల్యం చేస్తారన్నదే రానున్న రోజుల్లో వినియోగదారులకు కీలకంగా మారనుంది.

ఎలక్ట్రానిక్స్‌పై పెరుగుతున్న ఖర్చు..Rising Costs in the Electronics Sector

ఎల్‌ఈడీ టీవీలు, సెటాప్‌బాక్స్‌లు, స్మార్ట్‌ఫోన్ల తయారీలో అవసరమైన మెమొరీ చిప్స్‌, ఓపెన్‌ సెల్‌, సెమీకండక్టర్‌ చిప్స్‌, మదర్‌బోర్డులు వంటి కీలక భాగాలు ఎక్కువగా విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. డాలర్‌ విలువ పెరిగిన ప్రతిసారీ (Rupee Depreciation)ఈ దిగుమతుల ఖర్చు కంపెనీలకు అధికమవుతోంది. ఈ భారాన్ని సంస్థలు తాము భరించలేక, చివరకు వినియోగదారులపైకి బదిలీ చేస్తున్నాయి. దాంతో మార్కెట్లో టీవీలు, మొబైళ్ల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి.

టారిఫ్ స‌వ‌ర‌ణ‌లు అనివార్యం? Are Tariff Revisions Inevitable?
ఇక టెలికాం రంగానికీ (Rupee Depreciation)ఈ ప్రభావం తప్పడం లేదు. దేశంలో మొబైల్‌ వినియోగదారుల సంఖ్య, డేటా వినియోగం ఎప్పటికప్పుడు పెరుగుతున్నప్పటికీ, టెలికాం సంస్థల లాభాలు ఆశించిన స్థాయిలో లేవు. పోటీ ఎక్కువగా ఉండటంతో టారిఫ్‌లు చాలా కాలంగా తక్కువగానే కొనసాగుతున్నాయి. అయితే ఇప్పుడు ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో టారిఫ్‌ సవరణలు అనివార్యమనే సంకేతాలు కనిపిస్తున్నాయి. రూపాయి క్షీణత (Rupee Depreciation), నెట్‌వర్క్‌ విస్తరణ ఖర్చులు, 5జీ సేవల పెట్టుబడులు.. ఇవన్నీ టెలికాం సంస్థలపై భారంగా మారాయి. అదే సమయంలో నెట్‌వర్క్‌ నిర్వహణ ఖర్చులు, కొత్త సాంకేతికతల పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సర్వీస్‌ ఛార్జీలు, ప్రీమియం ప్లాన్‌లపై దృష్టి సారిస్తూ ఆదాయం పెంచుకునే వ్యూహాలను అవి అమలు చేస్తున్నాయి. కొంతమేర టారిఫ్‌ పెంపు కూడా జరగొచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. టెలికాం సంస్థలు టారిఫ్‌లను పెంచడం లేదా కొన్ని పథకాల కాల వ్య‌వ‌ధిని తగ్గించడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నాయి. మొత్తానికి, రూపాయి బలహీనత ప్రభావం టీవీ, మొబైల్‌ కొనుగోలు నుంచీ రీచార్జ్‌ ఖర్చుల వరకు విస్తరిస్తోంది. దీని వల్ల కుటుంబ బడ్జెట్‌పై భారం పెరుగుతున్నప్పటికీ, మారుతున్న ఆర్థిక పరిస్థితుల్లో ఇది తప్పనిసరి పరిణామమని నిపుణులు చెబుతున్నారు.

జ‌న‌వ‌రి నుంచి ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం.. Prices Likely to Rise from January

– రూపాయి ప‌త‌నం (Rupee Depreciation).. దిగుమతి విడిభాగాల ఖర్చులు పెరిగిన నేప‌థ్యంలో టీవీల ధరలను 3–4 శాతం వరకు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. కాగా జనవరి నుంచి టెలివిజన్‌ ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. దేశీయంగా తయారవుతున్న లేదా ఇక్కడే అసెంబ్లింగ్‌ జరుగుతున్న ఎల్‌ఈడీ టీవీల్లో విలువ జతచేరేది కేవలం 30 శాతమే. మిగతా 70 శాతం విడిభాగాలు విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ముఖ్యంగా ఓపెన్‌ సెల్‌, సెమీకండక్టర్‌ చిప్స్‌, మదర్‌బోర్డులు వంటి కీలక భాగాలన్నీ దిగుమతులపైనే ఆధారపడాల్సి వస్తోంది. డాలర్‌ విలువ రూ.90 మించడంతో కంపెనీలపై భారం పెరిగింది. దీన్ని తట్టుకోవాలంటే టీవీల ధరలను 3–4 శాతం పెంచక తప్పదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
– గత ఏడాది సెప్టెంబరులో 32 అంగుళాలు, అంతకుమించిన టీవీలపై జీఎస్‌టీని ప్రభుత్వం 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించింది. దీని వల్ల అప్పట్లో టీవీల ధరలు రూ.4,500 వరకు తగ్గాయి. మొత్తం మీద సుమారు 10 శాతం వరకు ధరలు తగ్గిన పరిస్థితి కనిపించింది. అయితే ఇప్పుడు రూపాయి క్షీణత ప్రభావంతో జనవరి నుంచి ఆ తగ్గుదల కొంతమేర తగ్గి, ధరలు మళ్లీ స్వల్పంగా పెరగనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

స్వ‌ల్పంగా పెరిగిన ప్రీపెయిడ్‌ ఛార్జీలు …Prepaid Charges See a Marginal Hike

డాలర్‌ విలువ పెరుగుతున్న నేపథ్యంలో (Rupee Depreciation) గత 40 రోజులుగా సెల్‌ఫోన్‌ ధరలను కంపెనీలు స్వల్పంగా పెంచాయి. దిగుమతి ఖర్చులు అధికమవడం వల్ల ఈ భారం వినియోగదారులపై పడుతోంది. అదే సమయంలో టెలికాం రంగంలోనూ మార్పులు కనిపిస్తున్నాయి. తమ లాభదాయకతను మెరుగుపరుచుకునేందుకు టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు ప్రీపెయిడ్‌ ఛార్జీల పెంపు, పథకాల కాలావధి తగ్గింపు వంటి చర్యలకు దిగుతున్నాయి. డేటా వినియోగం పెరుగుతున్నప్పటికీ ఆదాయ వృద్ధి పరిమితంగా ఉండటంతో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్‌ జియోను మినహాయిస్తే, మిగిలిన ప్రధాన సంస్థలన్నీ ఇదే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే యిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా టారిఫ్‌ సవరింపులకు సంబంధించిన వివరాలను ప్రకటిస్తున్నాయి. కొన్ని పథకాల ధరలు పెరగగా, మరికొన్ని ప్లాన్‌లలో కాలావధిని తగ్గించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ కూడా ఇదే బాటలో నడుస్తోంది. కొన్ని ప్రీపెయిడ్‌ పథకాలలో వాలిడిటీని తగ్గిస్తూ మార్పులు చేస్తోంది. దీంతో వినియోగదారులు మళ్లీ రీచార్జ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తానికి సెల్‌ఫోన్‌ ధరలతో పాటు ప్రీపెయిడ్‌ రీచార్జ్‌ ఖర్చులు కూడా పెరుగుతుండటంతో సామాన్యుడి జేబుపై భారం మరింత పెరుగుతోంది. రానున్న రోజుల్లో టారిఫ్‌లపై మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని టెలికాం వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఆదాయంలో వృద్ధి తగ్గడం వల్లేనా? Is the Slowdown in Revenue Growth the Reason?

– టెలికాం సంస్థల ఆదాయాల్లో వృద్ధి ఇటీవలి కాలంలో మందగిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికంలో 14–16 శాతం మధ్య ఉన్న టెలికాం నెట్‌వర్క్‌ సంస్థల సగటు ఆదాయ వృద్ధి, సెప్టెంబరు త్రైమాసికానికి వచ్చేసరికి 10 శాతానికి పరిమితమైంది. డిసెంబరు త్రైమాసికంలో ఇది ఇంకా తగ్గే అవకాశాలున్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
– డేటా వినియోగం పెరుగుతున్నా, పోటీ తీవ్రంగా ఉండటం, టారిఫ్‌లు తక్కువగా కొనసాగడం వల్ల ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోతోంది. మరోవైపు నెట్‌వర్క్‌ నిర్వహణ ఖర్చులు, 5జీ సేవల పెట్టుబడులు, స్పెక్ట్రమ్‌ వ్యయాలు టెలికాం సంస్థలపై భారంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాభదాయకతను కాపాడుకోవడం పెద్ద సవాలుగా మారింది.
– ఈ నేపథ్యంలోనే ఆదాయాన్ని పెంచుకునేందుకు టెలికాం సంస్థలు పలు మార్గాలు అన్వేషిస్తున్నాయి. అందులో భాగంగానే ప్రీపెయిడ్‌ ఛార్జీల పెంపు, పథకాల కాలావధి తగ్గింపు వంటి చర్యలకు సిద్ధమవుతున్నాయి. రానున్న రోజుల్లో ప్రీపెయిడ్‌ టారిఫ్‌లను 15 శాతం వరకు పెంచే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.
– మొత్తానికి ఆదాయ వృద్ధి తగ్గ‌డం వ‌ల్లే టెలికాం రంగంలో తాజా మార్పులకు కారణమవుతోందని నిపుణులు చెబుతున్నారు. దీని ప్రభావం వినియోగదారులపై పడుతున్నప్పటికీ, రంగం నిలదొక్కుకోవాలంటే ఈ చర్యలు తప్పవని పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

ఇప్పటికే ఈ మార్పులు..Changes Already Underway

ప్రీపెయిడ్‌ ఛార్జీల పెంపు దిశగా టెలికాం సంస్థలు (Rupee Depreciation)ఇప్పటికే కొన్ని మార్పులు అమలు చేస్తున్నాయి. ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో భాగంగా పథకాల ధరలు, కాల వ్య‌వ‌ధుల్లో సవరణలు చేపట్టాయి. వొడాఫోన్‌ ఐడియా తన వార్షిక ప్రీపెయిడ్‌ పథకం ధరను పెంచింది. ఇప్పటివరకు రూ.1,999గా ఉన్న ఈ పథకాన్ని 12 శాతం పెంచి రూ.2,249గా మార్చింది. అలాగే 84 రోజుల వాలిడిటీ ఉన్న పథకం ధరను రూ.509 నుంచి 7 శాతం పెంచి రూ.548కు పెంచింది. ఎయిర్‌టెల్‌ కూడా ధరల సవరణకు అడుగులు వేసింది. నెలవారీగా అందుబాటులో ఉన్న అతి తక్కువ రీఛార్జి పథకం ధరను రూ.189 నుంచి రూ.10 పెంచి కొత్త ధరను అమలు చేస్తోంది. ఇక ప్రభుత్వరంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం ఇప్పటివరకు ఛార్జీలు పెంచలేదు. అయితే తక్కువ ధరలో లభిస్తున్న కొన్ని రీఛార్జి పథకాల కాల వ్య‌వ‌ధులను తగ్గించింది. దీంతో వినియోగదారులు ముందుకంటే త్వరగా మళ్లీ రీఛార్జ్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మొత్తంగా చూస్తే, ధరలు పెంచడం లేదా వాలిడిటీ తగ్గించడం రూపంలో టెలికాం రంగంలో మార్పులు ఇప్పటికే మొదలయ్యాయి. రానున్న రోజుల్లో మరిన్ని సవరణలు చోటు చేసుకునే అవకాశముందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

అంచనాలు ఇలా… Here Are the Projections…

– సమీప భవిష్యత్తులో  ఎన్నికలు వంటి కీలక పరిణామాలు లేనందున, టారిఫ్‌ పెంపునకు ఇదే సరైన సమయమని టెలికాం సంస్థలు భావిస్తున్నాయని బ్రోకరేజ్‌ సంస్థలు వెల్ల‌డిస్తున్నాయి. ఈ నెలలోనే ప్రీపెయిడ్‌ టారిఫ్‌లలో మార్పులు రావచ్చని అంచనా వేస్తున్నాయి.
– నెలవారీ అపరిమిత కాల్స్‌, రోజుకు 1.5 జీబీ డేటా అందించే పథకాల ధరలు సగటున రూ.50 వరకు పెరగొచ్చని తెలిపింది. ఆదాయ వృద్ధి మందగించిన నేపథ్యంలో ఈ పెంపు ద్వారా టెలికాం సంస్థలు లాభదాయకతను మెరుగుపరుచుకోవాలని చూస్తున్నట్లు విశ్లేషించింది.
– ఇక వొడాఫోన్‌ ఐడియా విషయానికి వస్తే, తక్కువ మొత్తంలో రీఛార్జ్‌ చేసుకునే చందాదారులను ఇప్పటికే ఎయిర్‌టెల్‌, జియోకు కోల్పోయినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎప్పటి నుంచో వొడాఫోన్‌, ఐడియా నెట్‌వర్క్‌లను వినియోగిస్తున్న కొందరు వినియోగదారులు మాత్రం అదే సంస్థలతో కొనసాగుతున్నారు. వీరిలో ఎక్కువ మంది 365 రోజుల కాల వ్య‌వ‌ధి ఉన్న వార్షిక పథకాలను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.
– 5జీ సేవల కోసం కొంతమంది వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారినప్పటికీ, ఇప్పుడు వొడాఫోన్‌ ఐడియా కూడా దశలవారీగా 5జీ సేవలను అందుబాటులోకి తీసుకువస్తుండటం గమనార్హం. దీని వల్ల చందాదారుల నిలుపుదలపై సానుకూల ప్రభావం ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *