భారత స్టాక్ మార్కెట్ నుండి విదేశీ పెట్టుబడులు ఎందుకు వెళ్లిపోతున్నాాయి? Why Are Foreign Investors Pulling Out of the Indian Stock Market?

Posted by

భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడిదారులు ఇటీవల పెద్ద ఎత్తున తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో ఒడిదుడుకులు పెరుగుతున్నాయి. రూపాయి విలువ కూడా ఒత్తిడికి లోనవుతోంది. ఈ పరిణామం సామాన్య పెట్టుబడిదారుల్లో అనేక సందేహాలకు దారితీస్తోంది. ఒకప్పుడు భారత స్టాక్‌ మార్కెట్‌  విదేశీ పెట్టుబడిదారులకు ‘సురక్షిత స్వర్గం’గా కనిపించింది. వేగవంతమైన ఆర్థిక వృద్ధి, యువ జనాభా, డిజిటల్‌ విప్లవం, వినియోగదారుల ఆధారిత ఆర్థిక వ్యవస్థ… ఇవన్నీ భారత్‌ను గ్లోబల్‌ పెట్టుబడుల ఆకర్షణగా నిలిపాయి. కానీ ఇటీవల కొద్ది నెల‌లుగా స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు (FPIలు) భారత మార్కెట్‌ నుంచి భారీగా నిష్క్రమిస్తున్నాయి. ఒక్కో నెలలో వేల కోట్ల రూపాయల విలువైన షేర్లు అమ్మకానికి గురవుతున్నాయి. ఎఫ్‌పీఐల నిష్క్రమణ వెనుక గ్లోబల్‌ ఆర్థిక ఒత్తిళ్లు, దేశీయ సవాళ్లు ఉన్నాయి. అయితే ఇది తాత్కాలిక పరిణామమేనని నిపుణుల అభిప్రాయం. భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నందున, గ్లోబల్‌ పరిస్థితులు అనుకూలిస్తే విదేశీ పెట్టుబడులు మళ్లీ భారత్‌ వైపు వచ్చే అవకాశం ఉంది. దేశీయ పెట్టుబడిదారులు, మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా వచ్చే పెట్టుబడులు మార్కెట్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎస్‌ఐపీ పెట్టుబడులు నిరంతరం పెరుగుతుండటం సానుకూల అంశం.

విదేశీ పెట్టుబడులు అంటే ? What Are Foreign Investments?

ఇతర దేశాలకు చెందిన వ్యక్తులు, సంస్థలు లేదా కంపెనీలు మన దేశంలో డబ్బు పెట్టడాన్ని విదేశీ పెట్టుబడులు (Foreign Investment) అంటారు. ఇవి లాభాల కోసం భారత్‌లో వ్యాపారం చేయడం, షేర్లు కొనడం లేదా పరిశ్రమలు నెలకొల్పడం వంటి రూపాల్లో ఉంటాయి. విదేశీ పెట్టుబడులు ప్రధానంగా రెండు రకాలుగా ఉంటాయి. ఒక‌టి ఎఫ్‌డీఐ (Foreign Direct Investment), రెండోది ఎఫ్‌పీఐ (Foreign Portfolio Investment). ఎఫ్‌డీఐలు దీర్ఘకాలిక పెట్టుబడులు. ఫ్యాక్టరీలు, మౌలిక వసతులు, తయారీ రంగంలో నేరుగా పెట్టుబడి పెడతారు. కానీ ఎఫ్‌పీఐలు… స్టాక్‌ మార్కెట్‌, బాండ్ల మార్కెట్‌లో పెట్టే తక్షణ లాభాల ఆధారిత పెట్టుబడులు. ఇవి వేగంగా వస్తాయి, అంతే వేగంగా వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఆందోళన కలిగిస్తున్నది ఎఫ్‌పీఐల నిష్క్రమణ. ఇటీవల‌ కాలంలో విదేశీ పెట్టుబడిదారులు భారత ఈక్విటీ మార్కెట్‌ నుంచి వరుసగా నిష్క్రమిస్తున్నారు. కొన్ని నెలల్లోనే లక్షల కోట్ల రూపాయల విలువైన షేర్లు అమ్ముడుపోయాయి. నిఫ్టీ, సెన్సెక్స్‌ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరినా…విదేశీ పెట్టుబడిదారుల అమ్మకాలు ఆగడం లేదు. మార్కెట్‌ స్థాయి పెరుగుతున్నా, గ్లోబల్‌ ఇన్వెస్టర్ల నమ్మకం మాత్రం కొంత తగ్గుతోంది. దీనికి ప్రధాన కారణం అమెరికా వడ్డీ రేట్ల పెరుగుదల. ‘డాలర్‌ బలం’ .. రూపాయి ప‌తనం.

క‌రెన్సీ రిస్క్ భ‌యంతోనే.. Driven by Currency Risk Fears

భారత మార్కెట్‌ నుంచి పెట్టుబడులు బయటకు వెళ్లడానికి ప్రధాన కారణం అమెరికా కేంద్ర బ్యాంక్‌ (Federal Reserve) తీసుకుంటున్న కఠిన ద్రవ్య విధానం. అమెరికాలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు ఫెడ్‌ వడ్డీ రేట్లను వరుసగా పెంచింది. దీంతో అమెరికా బాండ్లపై లాభాలు పెరిగాయి. డాలర్‌ బలపడింది అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్ల నుంచి పెట్టుబడులు అమెరికా వైపు మళ్లాయి. విదేశీ పెట్టుబడిదారుల దృష్టిలో… రిస్క్‌ తక్కువ – రాబడి ఎక్కువ అన్నదే కీలకం. అమెరికా ట్రెజరీ బాండ్లు ఇప్పుడు అదే అవకాశాన్ని ఇస్తున్నాయి. డాలర్‌ బలపడితే రూపాయికి దెబ్బ. కరెన్సీ రిస్క్‌ భయం డాలర్‌ బలపడటం అంటే… రూపాయి బలహీనపడటం. విదేశీ పెట్టుబడిదారు భారత స్టాక్‌లో పెట్టుబడి పెట్టి లాభం పొందినా, రూపాయి విలువ పడిపోతే…డాలర్‌లో లెక్కిస్తే అతడికి నష్టం రావచ్చు. ఈ కరెన్సీ రిస్క్ భయంతోనే చాలామంది ఎఫ్‌పీఐలు భారత మార్కెట్‌ నుంచి వెనక్కి అడుగేస్తున్నారు.

భారత మార్కెట్‌ ఖరీదైనదా? Is the Indian Market Overvalued?

ప్రస్తుతం భారత మార్కెట్‌ అనేక అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే ఖరీదైనదిగా ఉంది. పీఈ రేషియోలు (Price-to-Earnings) చారిత్రక సగటుతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. దీంతో విదేశీ పెట్టుబడిదారులు “ఖరీదైన మార్కెట్‌లో ఎందుకు రిస్క్‌ తీసుకోవాలి?” అని భావిస్తున్నారు. భార‌త్‌తో పోల్చితే చైనా, బ్రెజిల్‌, దక్షిణ కొరియా వంటి దేశాల్లో స్టాక్స్‌ తక్కువ విలువలకే లభిస్తున్నాయి. కొన్నేళ్లుగా చైనా ఆర్థిక మందగమనం, నియంత్రణలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా… విదేశీ పెట్టుబడులు చైనా నుంచి భారత్‌ వైపు మళ్లాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చైనా ప్రభుత్వం ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీలు ప్రకటించడం, స్టాక్‌ మార్కెట్‌ను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడంతో… కొంతమంది ఇన్వెస్టర్లు మళ్లీ చైనా వైపు చూస్తున్నారు. అయితే దీని ప్రభావం భారత్‌పై పడుతోంది.

జియోపాలిటికల్‌ టెన్షన్స్ Geopolitical Tensions

ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరత పెరుగుతోంది. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, తైవాన్‌ అంశంపై చైనా–అమెరికా ఉద్రిక్తత ఈ పరిణామాలన్నీ గ్లోబల్‌ ఇన్వెస్టర్లను రిస్క్‌ అవాయిడెన్స్‌ వైపు నడిపిస్తున్నాయి. అందుకే రిస్క్‌ పెరిగినప్పుడు…వాళ్లు ముందుగా మార్కెట్ల నుంచి నిష్క్రమిస్తున్నారు. అయితే దేశీయ కారణాలు కూడా లేకపోలేదు . విదేశీ పెట్టుబడిదారులు కేవలం గ్లోబల్‌ అంశాలనే కాకుండా… దేశీయ పరిస్థితులనూ గమనిస్తారు. కార్పొరేట్‌ లాభాల వృద్ధి అంచనాలు తగ్గడం, కొన్ని రంగాల్లో డిమాండ్‌ మందగించడం, ప్రభుత్వ ఖర్చులపై ఒత్తిడి, నియంత్రణ సంస్థల కఠినత ఇవన్నీ పెట్టుబడిదారుల మనోభావాలను ప్రభావితం చేస్తున్నాయి.

విదేశీయులు వెళ్తే… దేశీయులు నిలబెడుతున్నారా? As Foreign Investors Exit, Are Domestic Investors Holding the Fort?

ఒక ముఖ్యమైన మార్పు ఏమిటంటే విదేశీ పెట్టుబడిదారులు అమ్మకాలు చేస్తున్నా… దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు (DIIలు), రిటైల్‌ ఇన్వెస్టర్లు మార్కెట్‌కు బలంగా నిలుస్తున్నారు. ఎస్‌ఐపీ పెట్టుబడులు ప్రతి నెలా కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇది భారత మార్కెట్‌కు ఒక రక్షణ కవచంలా మారింది.

ఇది ప్రమాదమా? లేక అవకాశమా? Is This a Risk or an Opportunity?

విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ తాత్కాలికంగా మార్కెట్‌పై ఒత్తిడి తెచ్చినా… దీన్ని పూర్తిగా ప్రతికూలంగా చూడాల్సిన అవసరం లేదు. ఎఫ్‌పీఐలు వెళ్లిన ప్రతి సారి, సరైన ధరల వద్ద అవకాశాలు పుడతాయ‌న్న‌ది చ‌రిత్ర చెబుతోంది. ఇదిలా ఉండ‌గా భారత్‌ ఆర్థిక ప్రాతిపదికలు ఇంకా బలంగానే ఉన్నాయి. జీడీపీ వృద్ధి, డెమోగ్రాఫిక్‌ డివిడెండ్‌, డిజిటల్‌ ఇండియా, తయారీ రంగ ప్రోత్సాహం.. ఈ అంశాలు దీర్ఘకాలంలో భారత్‌ను మళ్లీ విదేశీ పెట్టుబడుల గమ్యంగా మార్చగలవు.

అన్ని కలిసొస్తినే.. Only If All Factors Fall into Place

విధాన స్థిరత్వం, పెట్టుబడిదారులకు నమ్మకం, కార్పొరేట్‌ లాభాల వృద్ధి ఇవన్నీ కలిసొస్తే… విదేశీ పెట్టుబడులు మళ్లీ భారత మార్కెట్‌లోకి ప్రవేశించడం ఖాయం. విదేశీ పెట్టుబడుల నిష్క్రమణ – హెచ్చరికే కానీ భయం కాదు. భారత స్టాక్‌ మార్కెట్‌ నుంచి విదేశీ పెట్టుబడులు వెళ్లడం ఒక హెచ్చరిక మాత్రమే. ఇది ఆర్థిక వ్యవస్థ బలహీనతకు సంకేతం కాదని నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్‌ ఆర్థిక చక్రంలో ఇది సహజమైన ప్రక్రియ. దీన్ని సమర్థంగా ఎదుర్కొని, దేశీయ బలాలను వినియో గించుకుంటే… భారత్‌ మళ్లీ ప్రపంచ పెట్టుబడిదారుల ప్రథమ ఎంపికగా నిలుస్తుంది. అంతవరకు… జాగ్రత్త, అవగాహన, దీర్ఘకాలిక దృష్టే పెట్టుబడిదారులకు ఆయుధం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *