విదేశాల్లో ఉన్న కొందరు తెలుగు ఎన్ఆర్ఐలు స్వదేశానికి వస్తున్నప్పుడు.. తెలియకుండానే కొన్ని ముఖ్యమైన నిబంధనలను విస్మరిస్తుంటారు. దీనివల్ల లక్షల రూపాయల జరిమానా పడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆస్తులు, వాహనాలు, బ్యాంక్ ఖాతాలు, ఆధార్–పాన్ లింక్, ప్రాపర్టీ ట్యాక్స్, డ్రైవింగ్ లైసెన్స్ వంటి అంశాల్లో జాగ్రత్త అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు. భారత్ పర్యటనలో ఒకరోజు సమయం కేటాయించి ఈ పనులు పూర్తి చేస్తే, లక్షల రూపాయల జరిమానా, కోర్టు కేసులు, ఆస్తి సమస్యలు అన్నీ దూరమవుతాయి. చిన్న పొరపాట్లు పెద్ద జరిమానాలకు దారి తీస్తాయి. ప్రతి ఎన్ఆర్ఐ కనీసం రెండేళ్లకు ఒకసారి ఇండియాలోని తమ ఆస్తి, బ్యాంక్, లీగల్ డాక్యుమెంట్లను పరిశీలించాలి.
ప్రాపర్టీ ట్యాక్స్ & రిజిస్ట్రేషన్… Property Tax & Registration
విదేశాల్లో ఉంటూ, స్వదేశంలో ఉన్న ఇళ్లు లేదా భూములకు పన్నులు చెల్లించకపోతే భారీ వడ్డీలు, జరిమానాలు విధించే అవకాశ ఉంది. ప్రాపర్టీ రికార్డులు , తప్పు పేర్లు, పాత చిరునామాలు, బకాయిలు వెంటనే సరిదిద్దుకోవాలి.
వాహన రిజిస్ట్రేషన్ సమస్యలు.. Vehicle Registration Issues
కొంతమంది ఎన్ఆర్ఐలు దేశం విడిచి వెళ్ళే ముందు తమ పేరున ఉన్న వాహనాలను రీ-రిజిస్ట్రేషన్ చేయకుండా వదిలేస్తారు. ఈ వాహనాలు రోడ్డు మీద ఉన్నా, లేక గ్యారేజీలో ఉన్నా, RTO ఫైన్స్ పేరుతో లక్షల రూపాయల బిల్లులు పడొచ్చు. ఉపయోగంలో లేని వాహనాలను “Non-Use Declaration”గా ప్రకటించడం మర్చిపోవద్దు.
పాన్–ఆధార్ లింక్ తప్పనిసరి.. PAN–Aadhaar Linking is Mandatory
పాన్ కార్డు ఆధార్తో లింక్ చేయకపోతే పన్ను రిటర్న్స్, బ్యాంక్ లావాదేవీలు, ఆస్తి కొనుగోళ్లు అన్నీ నిలిచిపోతాయి. అనేక మంది ఎన్ఆర్ఐలు ఈ విషయంలో నిర్లక్ష్యం వహించడం వల్ల జరిమానాలు చెల్లిస్తూ ఉంటారు.
బ్యాంక్ ఖాతాలు – NRE/NRO స్పష్టత అవసరం.. Bank Accounts – Clarity Needed on NRE/NRO
ఇండియా బ్యాంక్ ఖాతాలను సాధారణ (Savings)గా ఉంచి విదేశీ లావాదేవీలు చేస్తే FEMA నియమాల ప్రకారం ఉల్లంఘనగా పరిగణిస్తారు. అందుకే NRE లేదా NRO అకౌంట్గా మార్చుకోవడం మేలు.
బిల్డింగ్ అనుమతులు & రెగ్యులరైజేషన్.. Building Permissions & Regularization
ప్రాపర్టీ నిర్మాణాలు పాత అనుమతులతో ఉంటే, తాజా రెగ్యులరైజేషన్ పథకాలలో చేర్చుకోవాలి. లేకపోతే, రాబోయే కాలంలో అమ్మకాలు లేదా రిజిస్ట్రేషన్లలో ఇబ్బందులు వస్తాయి.
ఎన్ఆర్ఐలందరూ తెలుసుకోవాల్సిన విషయం! A Must-Know for All NRIs!
విదేశాల్లో ఏళ్ల తరబడి ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న చాలామంది ఇప్పటికీ భారతదేశంలో ‘రెసిడెంట్’ స్టేటస్తోనే ఉంటున్నారు. అయితే ఇదే పెద్ద సమస్యగా మారుతోంది. ఇన్కమ్ ట్యాక్స్ చట్టం ప్రకారం, మీరు ఏడాదిలో 182 రోజులు కంటే ఎక్కువ విదేశాల్లో ఉంటే నాన్ రెసిడెంట్’ (NRI) అవుతారు. ఈ స్థితి ప్రకారం బ్యాంక్ ఖాతాలు, పన్నులు, ఇన్వెస్ట్మెంట్లు అన్నీ మారాలి. అయితే చాలా మంది ఇది చేయకపోవడం వల్ల పన్ను ఉల్లంఘనలుగా లక్షల జరిమానాలు చెల్లించాల్సి వస్తోంది. విదేశాల్లో ఉంటూ ఇండియా రెసిడెంట్గా కొనసాగితే పన్ను శాఖ దృష్టిలో మీరు రూల్ బ్రేకర్ అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆధార్ లేకపోతే పనులు ఆగిపోతాయా? Will Everything Stop Without Aadhaar?
ఆధార్ కార్డు అనేది ఎన్ఆర్ఐలకు తప్పనిసరి కాదు. భారతదేశంలో 182 రోజులు కంటే తక్కువకాలం ఉండే వారు ఆధార్ పొందాల్సిన అవసరం లేదు. ఇక భారత్లో ఎక్కువకాలం ఉండే ఎన్ఆర్ఐలు మాత్రమే ఆధార్ కోసం దరఖాస్తు చేయాలి. ఆధార్ ఉంటే బ్యాంక్ ఖాతా తెరవడం, ప్రాపర్టీ కొనుగోలు, పాన్ లింకింగ్, మొబైల్ కనెక్షన్ వంటి పనులు సులభమవుతాయి. కానీ ఇది చట్టపరంగా తప్పనిసరి కాదని యూఐడీఏఐ (UIDAI) స్పష్టం చేస్తోంది. కొందరు ఎన్ఆర్ఐల పేరుతో నకిలీ ఆధార్లు తయారవుతున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. కాబట్టి ఆధార్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు పాస్పోర్ట్, వీసా, ప్రవేశ ముద్రలతో కూడిన పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. “ఆధార్ లేకపోవడం వల్ల ఎన్ఆర్ఐలు భారతదేశంలో పెద్దగా ఇబ్బంది పడరు. కానీ భారత ఆర్థిక వ్యవస్థలో భాగస్వామ్యం కావాలనుకునే వారు ఆధార్ కార్డు పొందడం మంచిదే” అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
పాన్–ఆధార్ లింక్ తప్పనిసరా? Is PAN–Aadhaar Linking Mandatory?
ఎన్ఆర్ఐగా ఉన్నప్పటికీ మీరు భారత్లో ఆస్తులు, బ్యాంక్ ఖాతాలు, రెంటల్ ఇన్కమ్, షేర్లు లేదా ఇన్వెస్ట్మెంట్లు కలిగి ఉంటే .. ఆ ఆదాయం భారతదేశంలో పన్నుకు లోబడి ఉంటుంది. అలాంటి వారు తమ పాన్–ఆధార్లను తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. విదేశాల్లో పూర్తిగా నివసిస్తూ భారత్లో ఎటువంటి ఆర్థిక లావాదేవీలు, పన్ను సంబంధిత ఆదాయం లేకపోతే .. లింక్ చేయకపోయినా పరవాలేదు.
యూఐడీఏఐ , ఇన్కమ్ ట్యాక్స్ విభాగం ఈ విషయంపై స్పష్టత ఇచ్చాయి. కేవలం ‘Residential Status – Non Resident’ అని అప్డేట్ చేయడం ద్వారా మీ పాన్ చెల్లుబాటు అవుతుంది. ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ ఇనాక్టివ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ఎన్ఆర్ఐలు తమ స్థితిని సరిగా అప్డేట్ చేసుకుని, అవసరమైతే లింక్ పూర్తి చేయాలి. “తప్పనిసరి పరిస్థితుల్లో లింక్ చేయకపోతే పన్ను లావాదేవీలు ఆగిపోతాయి. కాబట్టి ఎన్ఆర్ఐలు తమ స్టేటస్ ప్రకారం ముందుగానే చర్యలు తీసుకోవాలి,” అని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు ఫిక్స్ చేసుకోండి.. Fix Your Investment Accounts
విదేశాల్లో స్థిరపడిన ఎన్నోమంది భారతీయులు భారత్లో పెట్టుబడులు కొనసాగిస్తున్నారు. మ్యూచువల్ ఫండ్లు, షేర్లు, బాండ్లు, ఇన్సూరెన్స్ పాలసీలు ఇలా అనేక ఖాతాలు “రెసిడెంట్” స్టేటస్లోనే ఉన్నాయి. అయితే పన్ను చట్టాల ప్రకారం ఎన్ఆర్ఐలు తమ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లను “నాన్ రెసిడెంట్”గా అప్డేట్ చేయాలి. రెసిడెన్సీ వివరాలు సరిచేయకపోతే పన్ను లెక్కల్లో వ్యత్యాసాలు వస్తాయి. బ్యాంక్ TDS కట్ తప్పుగా నమోదవుతుంది. లాభాలపై డబుల్ టాక్స్ పడే ప్రమాదం ఉంటుంది. ఎన్ఆర్ఐలు తమ డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లను NRI స్టేటస్కి మార్చి PIS (Portfolio Investment Scheme) ద్వారా కొనసాగించాలి. మ్యూచువల్ ఫండ్ కంపెనీలకు కొత్త KYC సమర్పించి, ఆధార్–పాన్ లింక్ వివరాలను అప్డేట్ చేయాలి. లేదంటే… అకౌంట్ బ్లాక్, ఫ్రీజ్ అయ్యే అవకాశం ఉంది. రీడెంప్షన్ డిలేలు, IT రిటర్న్స్లో వ్యత్యాసాలు రావచ్చు. “విదేశాల్లో ఉంటూనే భారత్లో పెట్టుబడులు ఉంచడం తప్పు కాదు. కానీ రెసిడెన్సీ స్టేటస్ సరిచేయకపోతే అది పెద్ద సమస్యగా మారుతుంది. బ్యాంక్, బ్రోకరేజ్, AMCలతో తక్షణం అప్డేట్ చేయడం అవసరం.” అంటున్నారు ఆర్థిక నిపుణులు.
ఇలా ఫిక్స్ చేసుకోండి.. Fix It This Way
– మీ డీమ్యాట్ / మ్యూచువల్ ఫండ్ సంస్థల వెబ్సైట్లలో లాగిన్ అవ్వాలి
– పాస్పోర్ట్, వీసా లేదా వర్క్ పర్మిట్ కాపీలను అప్లోడ్ చేయాలి
– రెసిడెన్సీ స్టేటస్ “NRI”గా మార్చుకోవాలి. ఎన్ఆర్ఐలు భారత్ సందర్శనలో ఈ మార్పులు పూర్తి చేసుకుంటే పన్ను, చట్టపరమైన ఇబ్బందులు దూరమవుతాయి.
లీగల్, ట్యాక్స్ సపోర్ట్ తప్పనిసరి.. Legal and Tax Support is Essential
ఎన్ఆర్ఐలకు భారత్లో ఒక లీగల్ లేదా చార్టెర్డ్ అకౌంటెంట్ (CA) సపోర్ట్ ఉండటం అత్యవసరం అని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పన్ను లింకింగ్ లోపాలు, రెసిడెన్సీ తప్పులు, అకౌంట్ అప్డేట్ ఆలస్యం వల్ల జరిమానాలు విధించే అవకాశం ఉంది. బ్యాంక్ లావాదేవీలు, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు, ప్రాపర్టీ సేల్స్ వంటి వాటిలో తప్పులు జరిగితే చట్టపరమైన సమస్యలు తలెత్తవచ్చు. అందుకే CA మార్గదర్శకత్వం ముఖ్యం. వారు పన్ను రిటర్నులు (IT Returns) సరిగా ఫైల్ చేయడంలో సహాయపడతారు. పాన్–ఆధార్ లింకింగ్, రెసిడెన్సీ మార్పులు సరిగ్గా చేస్తారు. NRE/NRO అకౌంట్ల టాక్స్ లెక్కలు నిర్వహిస్తారు. ఇన్వెస్ట్మెంట్ లాభాలపై టాక్స్ డిడక్షన్ సలహాలు ఇస్తారు.
లీగల్ అడ్వైజర్ ఎందుకు అవసరమంటే? Why is a Legal Advisor Necessary?
ప్రాపర్టీ రిజిస్ట్రేషన్లు, వారసత్వ హక్కులు, లీజ్ ఒప్పందాలు, చెల్లింపు వివాదాలు వంటి వాటిలో లీగల్ మార్గదర్శకత్వం లేకపోతే విదేశాల్లో ఉన్న వ్యక్తులు పెద్ద ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. “ఎన్ఆర్ఐగా ఉండి కూడా పన్ను, ఆస్తి విషయాల్లో నిర్లక్ష్యం చేయడం పెద్ద తప్పు. భారత్లో నమ్మకమైన CA లేదా లీగల్ అడ్వైజర్ ఉంటే అనవసరమైన చట్టపరమైన ఇబ్బందులు దూరమవుతాయి,” అని ఫైనాన్షియల్ కన్సల్టెంట్లు చెబుతున్నారు. ఎన్ఆర్ఐలు తమ నామినీలు, అడ్వైజర్ల వివరాలను రికార్డులో ఉంచి, అవసరమైన మార్పులు సమయానుకూలంగా చేయాలి. ఇది పన్ను, ఆస్తి, లీగల్ పరమైన సమస్యలన్నింటినీ దూరం చేస్తుంది.
ఇన్సూరెన్స్, హెల్త్ కేర్ కవరేజీ … Insurance and Health Care Coverage
విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు భారత్కి సెలవుల కోసం లేదా కుటుంబ కారణాలతో వచ్చే సమయంలో ఒక ముఖ్య విషయాన్ని తరచూ మర్చిపోతారు . అదే హెల్త్ ఇన్సూరెన్స్, ట్రావెల్ ఇన్సూరెన్స్.
ఇటీవలి కాలంలో పెరిగిన ఆసుపత్రి ఖర్చులు, ఎమర్జెన్సీ చికిత్సల వ్యయం కారణంగా, ఇన్సూరెన్స్ లేకుండా భారత్కి రావడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భారత్లో హెల్త్కేర్ ప్రైవేట్ రంగంలో అత్యధికంగా ఉంది. ఒక చిన్న ఆరోగ్య సమస్యకే లక్షల్లో ఖర్చు అవుతోంది. విదేశీ పాలసీలకు భారత్లో కవరేజీ పరిమితంగా ఉండొచ్చు, క్లెయిమ్ ప్రాసెసింగ్ కూడా ఆలస్యం కావచ్చు. అందుకే ఇన్సూరెన్స్ లేకపోతే ప్రమాదమే. భారత్లో అనేక బీమా సంస్థలు ఎన్ఆర్ఐలకు ప్రత్యేకంగా షార్ట్ టర్మ్ హెల్త్, ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలు అందిస్తున్నాయి. ఇవి భారత్లో ఉండే రోజులకు అనుగుణంగా డిజైన్ చేయబడ్డాయి. “ఇండియా ప్రయాణానికి ముందు హెల్త్ ఇన్సూరెన్స్ చెక్ చేయాలి. అవసరమైతే భారత్లో టాప్ ఇన్సూరెన్స్ కంపెనీ పాలసీ తీసుకోవాలి. ప్రాథమిక ఆరోగ్య చెకప్ కూడా తప్పనిసరి,” అని ఇన్సూరెన్స్ కన్సల్టెంట్లు సూచిస్తున్నారు. భారత్కి వచ్చే ప్రతి ఎన్ఆర్ఐ, తన ఇన్సూరెన్స్ డీటెయిల్స్, మెడికల్ హిస్టరీని వెంట తెచ్చుకోవాలి. అలా చేస్తే ఎమర్జెన్సీ పరిస్థితుల్లో చికిత్స సులభమవుతుంది.
రియల్ ఎస్టేట్ ఆస్తులను సక్రమంగా నిర్వహించాలి..Real Estate Properties Must Be Managed Properly
విదేశాల్లో స్థిరపడిన భారతీయులు భారత్లో పెద్ద సంఖ్యలో ఇళ్లను, స్థలాలను, వ్యవసాయ భూములను, కమర్షియల్ ప్రాపర్టీలను కలిగి ఉంటారు. అయితే చాలామంది ఈ ఆస్తులను సక్రమంగా నిర్వహించకపోవడం వలన ఆక్రమణలు, పన్ను ఇబ్బందులు, వారసత్వ వివాదాలు వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రాపర్టీ పత్రాలు అప్డేట్ చేయకపోతే, స్థానిక స్థాయిలో తప్పుడు బదిలీలు జరిగే అవకాశం ఉంది. రెంట్ అగ్రిమెంట్లు లేకుండా ఇచ్చిన ఇళ్లను తిరిగి పొందడం కష్టమవుతోంది.
స్థానిక పన్నులు చెల్లించకపోతే మునిసిపల్ నోటీసులు రావచ్చు.
ఎలా సక్రమంగా ఉంచుకోవాలంటే? How to Keep Things in Order?
పత్రాలు రెగ్యులర్గా వెరిఫై చేయాలి. EC, పట్టాలు, పన్ను రశీదులు చెక్ చేసుకోవాలి. పవర్ ఆఫ్ అటార్నీ (PoA) ద్వారా నమ్మకమైన వ్యక్తిని నియమించుకోవాలి. లీగల్ అడ్వైజర్ లేదా ప్రాపర్టీ మేనేజ్మెంట్ సర్వీస్ ద్వారా పర్యవేక్షణ చేయించాలి. వారసత్వ వివరాలు స్పష్టంగా డాక్యుమెంట్ చేయాలి. “విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు తమ ఆస్తులపై పట్టును కోల్పోవద్దు. ప్రతి సంవత్సరం ఒకసారి రికార్డులు వెరిఫై చేయడం తప్పనిసరి. ప్రాపర్టీ మేనేజ్మెంట్ కంపెనీల సాయం తీసుకుంటే ఇబ్బందులు తగ్గుతాయి,” అని రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్లు చెబుతున్నారు.
తల్లిదండ్రుల్ని మరవొద్దు! Don’t Forget Your Parents!
విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలతో బిజీగా ఉన్న ఎన్నోమంది భారతీయులు భారత్లో తమ తల్లిదండ్రులను వదిలి ఉంటున్నారు. డాలర్లు సంపాదించినా… తల్లిదండ్రుల మమకారం, ఆప్యాయతను పూడ్చే కరెన్సీ లేదు. చాలా మంది ఎన్ఆర్ఐలు నెలకు ఒకసారి డబ్బు పంపడమే తమ బాధ్యత అనుకుంటున్నారు. కానీ వృద్ధ తల్లిదండ్రులకు అవసరమయ్యేది సమయం, పరామర్శ, ఆప్యాయత. బ్యాంక్ బ్యాలెన్స్ కంటే, ఒక కాల్, వీడియో చాట్ ఎంతో విలువైనది. తల్లిదండ్రుల కోసం మెడికల్ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. నమ్మకమైన వ్యక్తిని లేదా స్నేహితుణ్ని స్థానిక కాంటాక్ట్గా ఉంచాలి. అవసరమైతే కేర్టేకర్ లేదా హోం హెల్త్ సపోర్ట్ ఏర్పాటు చేయాలి. బ్యాంకింగ్, బిల్లుల వ్యవహారాలకు పవర్ ఆఫ్ అటార్నీ (PoA) ఇవ్వాలి. ప్రతి ఎన్ఆర్ఐ తన తల్లిదండ్రుల ఆరోగ్య పరిస్థితి, ఆర్థిక భద్రత, భవిష్యత్ సపోర్ట్ గురించి ఆలోచించాలి. సంవత్సరంలో కనీసం ఒకసారి వారిని చూసి వెళ్లడం మన బాధ్యత.
భారతీయ మొబైల్ నంబర్ తప్పనిసరి! Indian Mobile Number is a Must!
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులు (ఎన్ఆర్ఐలు) తమ దేశీయ మొబైల్ నంబర్ను ఉంచుకోవడం అత్యవసరం. బ్యాంకు ఖాతాలు, పాన్, ఆధార్, ఇన్వెస్ట్మెంట్ అకౌంట్లు వంటి కీలక ఆర్థిక వ్యవహారాలు భారత మొబైల్ నంబర్తోనే OTP ద్వారా ధృవీకరించబడుతున్నాయి. అయితే చాలా మంది ఎన్ఆర్ఐలు విదేశాలకు వెళ్లిన తర్వాత తమ భారతీయ నంబర్ డీయాక్టివేట్ చేస్తుంటారు. దీనివల్ల లావాదేవీల్లో సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్యాంకింగ్ అప్డేట్లు, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్లు, ఆదాయపు పన్ను రిటర్నులు, మ్యూచువల్ ఫండ్ రీడంప్షన్లన్నీ మొబైల్ ఆధారంగా జరుగుతున్న ఈ డిజిటల్ యుగంలో భారత నంబర్ లేకపోతే లాగిన్ అవ్వడమే కష్టమవుతుంది. ఫలితంగా, ఖాతాలు ఫ్రీజ్ అవ్వడం లేదా యాక్సెస్ నిలిచిపోవడం వంటి పరిస్థితులు ఎదురవ్వొచ్చు. ప్రభుత్వం ఇప్పటికే “ఆధార్–పాన్ లింక్, బ్యాంక్ OTP, ఇన్వెస్ట్మెంట్ కన్ఫర్మేషన్” వంటి వ్యవహారాలు భారతీయ నంబర్ ద్వారానే జరగాలంటూ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. అందుకే ఎన్ఆర్ఐలు కనీసం ఒక నంబర్ను యాక్టివ్గా ఉంచి, రోమింగ్ ఫెసిలిటీతో వాడడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
